విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ కీలక వ్యాఖ్యలు

  • ప్రైవేటీకరణ, సెయిల్‌లో విలీనం చేసే పరిస్థితులు లేవని స్పష్టత
  • రాజ్యసభలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాసవర్మ వెల్లడి
  • వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చిన మంత్రి
  • స్టీల్ ప్లాంట్ ఆస్తులను శాశ్వత ఉద్యోగులే నిర్వహిస్తున్నారని వివరణ
విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ - ఆర్ఐఎన్ఎల్)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ గానీ, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)లో విలీనం గానీ చేసే పరిస్థితులు ఉత్పన్నం కావని స్పష్టం చేసింది. కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ మేరకు శుక్రవారం రాజ్యసభలో కీలక ప్రకటన చేశారు.

వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ సమాధానమిచ్చారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరించే ఆలోచన ఉందా అని సుబ్బారెడ్డి ప్రశ్నించగా, ఆ దిశగా ఎలాంటి పరిస్థితులు తలెత్తవని మంత్రి తేల్చి చెప్పారు. కొన్ని కార్యకలాపాల కోసం బయటి ఏజెన్సీల నుంచి సహాయం తీసుకోవడం సాధారణమేనని, దేశంలోని ఇతర ప్రభుత్వ రంగ ఉక్కు కర్మాగారాల్లోనూ ఇదే విధానం ఉందని వివరించారు. ఇది దశలవారీగా ప్లాంట్‌ను ప్రైవేటీకరించడం కిందకి రాదని పేర్కొన్నారు. ఆర్ఐఎన్ఎల్ ఆస్తులన్నింటినీ ఆ సంస్థ శాశ్వత ఉద్యోగులే నిర్వహిస్తున్నారని మంత్రి తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌లో చాలాకాలంగా ఉద్యోగులు, రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో, వైజాగ్ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై కేంద్ర మంత్రి చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.
 

Srinivas Varma
Visakhapatnam Steel Plant
Vizag Steel Plant
RINL
Steel Authority of India
SAIL
Privatization
YV Subba Reddy
Andhra Pradesh
Steel Industry

More Telugu News